Special Reports

కొండాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. రూ.1,400 కోట్ల విలువైన భూమికి రక్షణ

Published on

  • కొండాపూర్‌లో 7 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
  • కబ్జాకు గురైన పార్కులు, ప్రజావసరాల స్థలాలను స్వాధీనం చేసుకున్న హైడ్రా
  • ఆక్రమణలు తొలగించి, స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన అధికారులు
  • కాలనీ సంక్షేమ సంఘం ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం
  • దశాబ్దాల సమస్య పరిష్కారమవడంతో స్థానికుల ఆనందం
హైదరాబాద్ నగర శివారులోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన కొండాపూర్‌లో కబ్జాకు గురైన సుమారు 7 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో దాదాపు రూ.1,400 కోట్లు ఉంటుందని అంచనా. అధికారులు ఆక్రమణలను తొలగించి, శనివారం ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ప్రభుత్వ బోర్డులను సైతం ఏర్పాటు చేశారు.

వివరాల్లోకి వెళితే, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లోని సర్వే నంబర్ 78 నుంచి 93 పరిధిలో రాజరాజేశ్వరి నగర్ కాలనీ పేరుతో 1993లో గ్రామపంచాయతీ లేఅవుట్ వేశారు. ఈ లేఅవుట్‌లో ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 5 ఎకరాలు, పాఠశాలకు ఒక ఎకరా, పార్కులకు ఎకరాకు పైగా, కమ్యూనిటీ హాల్ కోసం 2181 గజాల స్థలాన్ని కేటాయించారు. అయితే, కాలక్రమేణా ఈ విలువైన స్థలాలు కబ్జాకు గురయ్యాయి. పాఠశాల స్థలంలో అపార్ట్‌మెంట్, కమ్యూనిటీ హాల్ స్థలంలో ప్రైవేటు దుకాణాలు, షెడ్లు వెలిశాయి.

ఈ ఆక్రమణల వెనుక బడాబాబులు ఉన్నారని, ప్రజావసరాల కోసం కేటాయించిన భూములను కాపాడాలని రాజరాజేశ్వరి నగర్ కాలనీ సంక్షేమ సంఘం హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. లేఅవుట్‌లోని ప్లాట్లు ఎల్ఆర్ఎస్ అయినప్పుడు, పార్కులు, ప్రజావసరాల స్థలాలు ఎలా ఆక్రమణదారుల సొంతమవుతాయని వారు ప్రశ్నించారు.

ఈ ఫిర్యాదుపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వెంటనే స్పందించి, అధికారులను క్షేత్రస్థాయి పరిశీలనకు ఆదేశించారు. లేఅవుట్ ప్రకారం ఆ భూములు ప్రజావసరాలకు చెందినవేనని నిర్ధారించుకున్న అధికారులు, వెంటనే ఆక్రమణలను తొలగించి, భూమి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని తమ సమస్యకు హైడ్రా పరిష్కారం చూపడంతో రాజరాజేశ్వరి నగర్‌లోని సుమారు 5 వేల కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. తమకు అండగా నిలిచిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపాయి.

Click to comment

Popular Posts

Copyright © 2026 ProbeTimes. Developed by SSIT- 8143363500.